ఇంకుడు గుంతలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-05-23T05:27:57+05:30 IST

భూగర్భజలాలను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోతున్నది.

ఇంకుడు గుంతలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు
మెదక్‌ పట్టణంలో ఇంకుడుగుంత లేక మురికి కాలువలో వృఽథాగా పోతున్న భగీరథ నీరు

   పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు


మెదక్‌ మున్సిపాలిటి, మే 22: భూగర్భజలాలను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోతున్నది.  ఇళ్ల నిర్మాణ సమయంలో అనుమతి రుసుముతో పాటు ధరావత్తు కింద కొంత డబ్బును ఇంకుడుగుంత నిర్మాణం పేరిట మున్సిపల్‌ శాఖ వసూలు చేస్తుంది. అయితే అంతటితోనే సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, మెదక్‌ మున్సిపాలిటీల్లో రెండేళ్లుగా టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఇంకుడుగుంతల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇంకుడుగుంతల నిర్మాణంపై శ్రద్ధ చూపాలని ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు. జల్‌శక్తి అభియాన్‌ పేరుతో ఇంకుడుగుంతలు నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కడా చేపట్టలేదు. కాగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారు దరఖాస్తు సమయంలో ఇంకుడుగుంత నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని యజమానికి తెలియజేస్తున్నట్లు మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి తెలిపారు. ఇంకుడు గుంతలు నిర్మించని యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు.


 


Updated Date - 2022-05-23T05:27:57+05:30 IST