మంత్రివర్గ పునర్వవస్థీకరణపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం: అజయ్ మాకెన్
ABN , First Publish Date - 2021-07-25T20:11:05+05:30 IST
రాజస్థాన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ, జిల్లా, బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ చీఫ్ల నియామకం..
న్యూఢిల్లీ: రాజస్థాన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ, జిల్లా, బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ చీఫ్ల నియామకం, బోర్డులు, కార్పొరేషన్లలో నియామకాలపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ రాజస్థాన్ ఇన్చార్జి అజయ్ మాకెన్ తెలిపారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని నేతలంతా తమకు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
''మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఈనెల 28, 29 తేదీల్లో మరోసారి రాజస్థాన్ వస్తాను. జిల్లా, బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ బృందాల నియామకాలపై ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశమవుతాను'' అని అజయ్ మాకెన్ తెలిపారు. కేబినెట్ విస్తరణ, రాజకీయ నియామకాలపై చర్చించేందుకు అజయ్ మాకెన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారంనాడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కార్పొరేషన్లు, బోర్డుల్లో రాజకీయ నియామకాలపై సాధ్యమైనంత త్వరగా ప్రజాప్రతినిధులు, స్టేట్ ఆఫీస్ బేరర్లు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై ఏకాభిప్రాయం సాధించాలని కూడా ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజస్థాన్ మేనిఫెస్టే అమలు ప్రగతిపై కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కూడా సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్యాంప్లో కొద్దికాలంగా అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ, రాజకీయ నియామకాల వ్యవహారం ఊపందుకుంది.