అధికార, ధన శక్తులపై పోరు!
ABN , First Publish Date - 2022-09-23T07:33:15+05:30 IST
దేశంలోని వ్యవస్థలను స్వాధీనం చేసుకున్న శక్తులతో తాము పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అపరిమిత ధనశక్తితో.. పార్టీలను, ఎమ్మెల్యేలను బెదిరించి ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేయగల సమర్థులని
బీజేపీ, సంఘ్లపై పోరాటానికి కలిసి రావాలి : రాహుల్
కోచిలో 15వ రోజు జోడో యాత్ర
కోచి, సెప్టెంబరు 22: దేశంలోని వ్యవస్థలను స్వాధీనం చేసుకున్న శక్తులతో తాము పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అపరిమిత ధనశక్తితో.. పార్టీలను, ఎమ్మెల్యేలను బెదిరించి ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేయగల సమర్థులని దుయ్యబట్టారు. గోవాలో దాని ఫలితాన్ని ఇటీవల చూశామని చెప్పారు. 15వ రోజు ఉదయం భారత్ జోడో యాత్రను గురువారమిక్కడ కోచిలోని అలూవా యూసీ కాలేజీ నుంచి ప్రారంభించిన రాహుల్.. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎ్సఎ్స)ల సిద్ధాంతం, ధనబలం, అధికార బలంపై పోరాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపిచ్చారు. ‘ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రజలకు చెప్పేందుకే నా పాదయాత్ర. రెండు ఆలోచనల కారణంగా ఇది విజయవంతమైంది. భారత్ ఐకమత్యంగా ఉండడం.. అంతఃకలహాలకు, విద్వేషాలకు దూరంగా ఉండడం అనేవి ఈ రెండు ఆలోచనలు’ అని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల గురించి అడుగగా.. తన యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికే సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు.