Excise Policy Case : మనీశ్ సిసోడియా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
ABN , First Publish Date - 2022-08-20T16:20:26+05:30 IST
ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం (Excise Policy) అమలులో
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం (Excise Policy) అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సిసోడియా ఇంట్లో సీబీఐ (Central Bureau of Investigation) శుక్రవారం దాదాపు 15 గంటలపాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహమ్మద్ శనివారం మాట్లాడుతూ, ఎక్సయిజ్ విధానం అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అల్కా లాంబా (Alka Lamba), అభిషేక్ దత్ (Abhishek Dutt) కూడా ఇదే డిమాండ్ చేశారు.
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ (Anil Kumar) అంతకుముందు మాట్లాడుతూ, బూటకపు కంపెనీలకు లిక్కర్ లైసెన్స్లను చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని, కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతోందని జూన్ నెలలో అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా (Rakesh Asthana)కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు.
ఆ పనులను ఆపేందుకే : సిసోడియా
ఇదిలావుండగా, తన వద్ద నుంచి తన కంప్యూటర్, ఫోన్, కొన్ని దస్తావేజులను సీబీఐ తీసుకెళ్లిందని మనీశ్ సిసోడియా చెప్పారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తదుపరి ప్రశ్నించేందుకు తనను సీబీఐ పిలవలేదన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతోనే...
ఢిల్లీ ఎక్సయిజ్ విధానం 2021-22ను అమలు చేయడంలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే జక్సేనా ఆదేశించడంతో సీబీఐ దాదాపు 20 చోట్ల సోదాలు నిర్వహించింది. మనీశ్ సిసోడియా ఇంట్లో దాదాపు 15 గంటలపాటు సోదాలు జరిగాయి.