బస్సు చార్జీల పెంపుపై ఆందోళన

ABN , First Publish Date - 2022-07-03T04:38:17+05:30 IST

ఆర్టీసీ చార్జీలు పెంచి జనంపై తీవ్ర భారం మోపారని, పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

బస్సు చార్జీల పెంపుపై ఆందోళన
రాయచోటి ఆర్టీసీ బస్టాండులో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు

జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన టీడీపీ నేతలు

రాయచోటి టౌన్‌, జూలై 2: ఆర్టీసీ చార్జీలు పెంచి జనంపై తీవ్ర భారం మోపారని, పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ నేతలు డిమాండ్‌  చేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ల ఎదుట ఆందోళన చేశారు. రాయచోటి, రాజంపేట, మదనపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, పెద్దమండెంలలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాయచోటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా బస్టాండులో ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడి వాహనం ఆర్టీసీ అని అత్యంత తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రజలను చేరవేస్తూ ప్రశంసలు పొందిందని అటువంటి ఆర్టీసీ ధరలకు జగన్‌రెడ్డి పాలనలో రెక్కలు రావడంతో సామాన్యుడి నడ్డి విరిచినట్లయిందన్నారు. కిలోమీటర్లను బట్టి చార్జీలు పెంచడంలో ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్థను కాకుండా ఉద్యోగస్తులకు మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకోవడంతో వారికి గతంలో వచ్చే సదుపాయాలు అందక అల్లాడిపోతున్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, రాజంపేట పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే చలపతి, సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డెయ్యయాదవ్‌, టీడీపీ నాయకులు షావుద్‌, సయ్యద్‌ హాజీ, మన్సూర్‌, మైనుద్దీన్‌, రెడ్డెయ్య, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T04:38:17+05:30 IST