బాధితులకు నష్టపరిహారం అందించాలి
ABN , First Publish Date - 2020-11-30T05:01:45+05:30 IST
ప్రభుత్వ నిర్లక్ష్యానికి బుగ్గవంక ప్రాంతంలోని పేదలు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి డిమాండ్ చేశారు.
టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి
కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్లక్ష్యానికి బుగ్గవంక ప్రాంతంలోని పేదలు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బుగ్గవంక బాధితులను కడప టీడీపీ ఇన్చార్జ్ అమీర్బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్.గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, వెంకటరెడ్డిలు వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం ముంపునకు గురైన బాధితులకు భోజనం అందించారు. బుగ్గవంక గేట్లు ఎత్తేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు కన్నీరు మున్నీరుగా వాపోయారు. అనంతరం శ్వేతరెడ్డి, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నివర్ తుఫాను హెచ్చరికలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడంతోనే ఈ విధంగా జరిగిందన్నారు. 2001లో బుగ్గవంక సంఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు పర్యటించి బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పరిహారం అందించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముంపునకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు.