గత పాలకవర్గం అక్రమాలపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-05-18T05:54:15+05:30 IST
గత పాలకవర్గం అక్రమాలపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు
ఘట్కేసర్ రూరల్, మే 17 : గత పాలకవర్గం(2013-2018) హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కొర్రెముల పంచాయతీ సభ్యులు మంగళవారం అదనపు కలెక్టర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలో బైనగారి నాగరాజు సర్పంచ్గా ఉన్న సమయంలో సర్వేనెంబర్ 735 నుంచి 748లో అక్రమ లేఅవుట్తో పాటు సప్తగిరి కాలనీలో ఎల్ఆర్ఎస్ లేకుండా దాదాపు 100 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఏకశిలనగర్లోని 400 గజాల పార్కు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే 3 అంతస్థుల భవనం నిర్మించడానికి సహకరించారని తెలిపారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాడని, మాజీ సర్పంచ్ ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకున్న యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు చేసి అట్టి పత్రాలతో బ్లాక్మొయిల్ చేస్తున్నాడని, అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన మాజీ సర్పంచుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచు కందుల రాజు పంచాయతీ సభ్యులు ఆంజనేయులు, సునీత, భాస్కర్, దుర్గరాజుగౌడ్, స్వామి, సుష్మ, అరుంధతి, బాబు, లక్ష్మి, భార్గవి తదితరులు పేర్కొన్నారు.