పరిహారం వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2021-04-21T06:42:19+05:30 IST
నిర్వాసితులందరికీ పరిహారం అందజేయడంలో, పునరావాసం కోసం స్థలసేకరణ చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భువనగిరి మండలంలోని బీఎన్తిమ్మాపురం ముంపు నిర్వాసితులు మంగళవారం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు.
పరిహారం, పునరావాసంకోసం ప్రాజెక్ట్ పనుల నిలిపివేత
బస్వాపురం రిజర్వాయర్ వద్ద నిర్వాసితుల ధర్నా
భువనగిరి రూరల్, ఏప్రిల్ 20: నిర్వాసితులందరికీ పరిహారం అందజేయడంలో, పునరావాసం కోసం స్థలసేకరణ చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భువనగిరి మండలంలోని బీఎన్తిమ్మాపురం ముంపు నిర్వాసితులు మంగళవారం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులు నిర్వాసితులతో మాట్లాడి తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో తమగ్రామం పూర్తిగా ముంపునకు గురవుతున్నా, తమకు పరిహారం అందజేయడంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్థులు రిజర్వాయర్ వద్దకు వస్తుండగా, పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. కాగా ఈ విషయమై నిర్వాసితులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు పునరావాసం కల్పించే వరకు రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని డిమాండ్చేస్తూ ధర్నా చేపట్టారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి తహసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ ఖుర్షిద్, భువనగిరి రూరల్ సీఐ వి.జానయ్య, ఎస్ఐ కె.సైదులు ధర్నా వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా పాజిటివ్తో హోంక్వారంటైన్లో ఉన్నారని, ఆమె ఆరోగ్యం కుదుట పడగానే నష్టపరిహారం, పునరావాసం పై ఖచ్చితమైన హామీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులను బుజ్జగించారు. దాదాపు నాలుగు గంటలపాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు, సర్పంచ్ పిన్నం లతా రాజు, ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశం, రాజు హెచ్చరించారు.