కమిషనర్ సారూ.. చీపురు పట్టారు..
ABN , First Publish Date - 2022-05-23T06:53:26+05:30 IST
ప్రజలంతా చెత్త శుభ్రతలో భాగస్వాములవ్వాలి.. పారిశుధ్య కార్మికులకు సహకరించాలి..
గోదావరిలో చెత్త శుభ్రతకు 3 గంటల పాటు శ్రమదానం
రాజమహేంద్రవరం, మే 22(ఆంధ్రజ్యోతి) : ప్రజలంతా చెత్త శుభ్రతలో భాగస్వాములవ్వాలి.. పారిశుధ్య కార్మికులకు సహకరించాలి.. ఇదీ ప్రతి అధికారి చెప్పే మాట.. ఆ మాట అయితే అనేస్తారు కానీ.. ఒక్కరూ పారిశుధ్య సిబ్బందితో మమేకమవ్వరు.. అయితే రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ మాత్రం అలాకాదు.. ఆయనా ప్రతి రోజూ పారిశుధ్య కార్మికులకు సూచనలు చేస్తూనే ఉంటారు. చెత్త శుభ్రత లేకపోతే ఊరుకోనని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా ఆదివారం గోదావరిలో పారిశుధ్యం మెరుగుపర్చాలని నిర్ణయించారు..మునిసిపల్ పారిశుధ్య కార్మికులు.. అధికారులు అంతా రంగంలోకి దిగారు.. వారితో పాటు కమిషనర్ చేయి కలిపారు.. ఇలా స్వయంగా గోదావరిలో చెత్త తీసి పారిశుధ్య కార్మికుల్లో ఉత్సాహం నింపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ సుమారు 3 గంటల సేపు శ్రమదానం కొనసాగింది. ఆ మూడు గంటలు పారిశుధ్య కార్మికులతో కలిసి గోదావరిని శుభ్రం చేశారు.