కలెక్టర్ వర్సెస్ బీజేపీ
ABN , First Publish Date - 2022-07-16T05:19:55+05:30 IST
జిల్లా కలెక్టర్ గిరీషాకు వ్యతిరేకంగా శుక్రవారం బీజేపీ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. తాము వినతిపత్రం ఇవ్వడానికి వెళితే.. రెండు గంటల పాటు వేచి ఉండేలా చేసి.. వినతిపత్రం తీసుకోనంటూ దురుసుగా కలెక్టర్ మాట్లాడారు అనేది బీజేపీ ఆరోపణ. అయితే తాను 150 మంది రైతులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉన్నానని, ముందస్తుగా బీజేపీ నాయకులు అపాయింట్మెంటు తీసుకోలేదనేది కలెక్టర్ వాదన. కలెక్టర్ వర్సెస్ బీజేపీగా మారిన సంఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే..
మా వినతిపత్రం తీసుకోలేదు..
రెండు గంటలు వేచి ఉండేలా చేశారు: బీజేపీ
150 మంది రైతులతో సమావేశంలో ఉన్నాను..
అపాయింట్మెంట్ తీసుకోలేదు
కలెక్టర్ అని చూడకుండా మాట్లాడారు: కలెక్టర్
రాయచోటి, జులై 15(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ గిరీషాకు వ్యతిరేకంగా శుక్రవారం బీజేపీ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. తాము వినతిపత్రం ఇవ్వడానికి వెళితే.. రెండు గంటల పాటు వేచి ఉండేలా చేసి.. వినతిపత్రం తీసుకోనంటూ దురుసుగా కలెక్టర్ మాట్లాడారు అనేది బీజేపీ ఆరోపణ. అయితే తాను 150 మంది రైతులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉన్నానని, ముందస్తుగా బీజేపీ నాయకులు అపాయింట్మెంటు తీసుకోలేదనేది కలెక్టర్ వాదన. కలెక్టర్ వర్సెస్ బీజేపీగా మారిన సంఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే..
బీజేపీ వాదన ప్రకారం..
‘‘కేంద్ర ప్రభుత్వం పేదలకు బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని ప్రజలకు ఇవ్వడం లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లారు. కలెక్టర్ను కలవాలని కలెక్టర్ క్యాంపు క్లర్క్కు తెలియజేశారు. పది నిమిషాలలో కలెక్టర్ వస్తారు. కలవవచ్చని ఆయన చెప్పారు. అలా రెండు గంటల సేపు ఎదురు చూసినా కలెక్టర్ రాలేదు. రెండు గంటల తర్వాత వచ్చిన కలెక్టర్ మాతో దురుసుగా మాట్లాడారు..’’ అంటూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్కు వ్యతిరేకంగా.. అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. కలెక్టర్ దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల శ్రీనివా్సయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ప్రవర్తన పట్ల ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కలెక్టర్ వాదన ప్రకారం..
‘‘రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి, రాయచోటి ఎ మ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, 150 మంది రైతులతో మంగంపేట బెరైటీస్ గనుల సమస్యపై గురువారం సమావేశంలో ఉన్నాను. బీజేపీ నాయకులు నన్ను కలవడానికి వస్తున్నట్లు నాకు తెలియదు. బీజేపీ నాయకులు ముందుగా అనుమతి కూడా తీసుకోలేదు. కలెక్టరేట్ ఎదుట ధ ర్నా చేసి.. నా చాంబర్ ఎదుట కూడా నినాదాలు చేస్తున్నారు. ఇది తెలిసి నేను వచ్చి.. నా చాంబర్ ఎదుట నినాదాలు ఎందు కు చేస్తున్నారు.. మీరు వచ్చిన విషయం కూడా నాకు తెలియ దు.. అన్నాను. బీజేపీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి బాగనే మా ట్లాడుతున్నారు.. అయితే అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. కనీసం కలెక్టర్తో మాట్లాడుతున్నాం.. అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడారు. నన్ను కలవడానికి వచ్చే సామాన్యులు, పేదలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు..’’ అని ఆంధ్రజ్యోతితో అన్నారు. జాతీయ పార్టీ.. కలెక్టర్ మధ్య తలెత్తిన ఈ వివాదం.. మరింత ముదరకుండా.. ఇరుపక్షాలు సామరస్యంగా వ్యవహరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.