దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తాం
ABN , First Publish Date - 2020-10-25T11:21:49+05:30 IST
ఇటీవల కుందూ నది వరదతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు.
చాపాడు, అక్టోబరు 24: ఇటీవల కుందూ నది వరదతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన కేతవరం గ్రామం వద్ద కుందూ నది వరదతో దెబ్బతిన్న వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధికారుల నివేదిక ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
లక్ష్మిపేట, కేతవరం గ్రామాల్లో మురికినీటి కాలువలు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించగా కాలువలు నిర్మిస్తామని చెప్పారు. లక్ష్మీపేటలోని ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని కూడా పరిశీలించారు. కియోస్క్ పరికరం పనిచేసే తీరు గురించి అగ్రికల్చలర్ అసిస్టెంట్ సుప్రియను అడిగి ఆయన తెలుసుకున్నారు. పాఠశాలకు మౌలిక వసతులు బాగున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ, మైదుకూరు ఏడీ కృష్ణమూర్తి, దువ్వూరు ఏవో ప్రవీణ్కుమార్ ఉన్నారు.