కొవిడ్పై విస్తృత అవగాహన
ABN , First Publish Date - 2020-12-05T06:01:37+05:30 IST
జిల్లాలో కొవిడ్ నియంత్రణలో భాగంగా జనవరి 19 వరకు 50 రోజుల పాటు వివిధ శాఖల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
విజయవాడ సిటీ : జిల్లాలో కొవిడ్ నియంత్రణలో భాగంగా జనవరి 19 వరకు 50 రోజుల పాటు వివిధ శాఖల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. శుక్ర వారం తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్-19 వ్యాప్తి, నియంత్రణపై 50 రోజుల పాటు నిర్వహించే చైతన్య కార్యక్రమాలను కలెక్టర్ విలేకర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 8,40,000 కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. 45,781 మంది కరోనా బారిన పడగా వారిలో 43,919 మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం 1220 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర సగటు కన్నా జిల్లాలో పాజిటివ్ రేటు తక్కువగా ఉంద న్నారు. జేసీలు కె.మాధవీలత, ఎల్.శివశంకర్, కె.మోహన్కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, మోప్మా పీడీ ప్రకాశరావు పాల్గొన్నారు.