దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2020-11-28T06:11:43+05:30 IST
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
లక్ష్మణచాంద, నవంబరు 27: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పీచర గ్రామ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, పంట కల్లాల ను, అలాగే రాచాపూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలన్నారు. అకాల వర్షాల వలన ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పౌర సరఫరాల శాఖ అదికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో మోహన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.