సిక్కులను ఆకట్టుకునేందుకు యోగి ప్రయత్నాలు

ABN , First Publish Date - 2021-10-10T15:42:23+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక సంఘటన

సిక్కులను ఆకట్టుకునేందుకు యోగి ప్రయత్నాలు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక సంఘటన నేపథ్యంలో సంయమనం పాటించిన సిక్కులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. గుర్ముఖి లిపిలో రాసిన ఓ లేఖను బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర సింగ్ జిల్లాలోని సిక్కులకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోని సిక్కులకు కూడా పంపించారు. 


లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు సిక్కులు ఉన్నారు. దినేశ్ చంద్ర మాట్లాడుతూ, సంయమనం పాటిస్తున్న సిక్కులకు ధన్యవాదాలు తెలిపామని, బాధిత కుటుంబాలకు కలిగిన విచారం తమ చర్య వల్ల తగ్గకపోయినప్పటికీ, ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో జరిగిన సంఘటనను ప్రభుత్వం, ప్రజలు సహా అందరూ ఖండిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని సామాన్య ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు సంయమనం పాటించాలని కోరారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో సహకరిస్తూ సంయమనం పాటిస్తున్న సిక్కు సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-10-10T15:42:23+05:30 IST