సొంతూరులో సీఎం మరోసారి భావోద్వేగం
ABN , First Publish Date - 2022-02-13T17:22:54+05:30 IST
రాష్ట్రంలో ముఖ్యమంత్రులు భావోద్వేగానికిలోనై కంటతడిపెట్టే సంప్రదాయం నిరంతరం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి పలుమార్లు కంటతడి పెట్టారు. అదే కోవలోనే ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రులు భావోద్వేగానికిలోనై కంటతడిపెట్టే సంప్రదాయం నిరంతరం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి పలుమార్లు కంటతడి పెట్టారు. అదే కోవలోనే ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై మరోసారి సొంతూరు హావేరి జిల్లా శిగ్గావిలో భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం హిరేబండిగేరి గ్రామంలో చెరువుకు వాయనం సమర్పించి పలు శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో మాట్లాడుతూ దేశ రక్షణకు కుమారుడిని పంపినట్టు నియోజకవర్గ ప్రజలు నన్ను పంపారన్నారు. సెలవు దొరికినప్పుడు సైనికుడు స్వగ్రామానికి వచ్చినట్టు నేను మీ చెంతకు వస్తుంటానన్నారు. బెంగళూరులో బయల్దేరే ముందు మీడియా ఎందుకు సార్ మీఊరు వెళ్తున్నారు అని అడిగారని, అక్కడికి వెడితే దొరికే సంతోషమే వేరని చెప్పానన్నారు. ఎక్కడా చెడ్డపేరు తీసుకురాకుండా పాలన సాగిస్తున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కంటతడిపెట్టినట్టుగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షా, జే పీ నడ్డాలతోపాటు మీ ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానన్నారు.