బంధువుల ఇళ్లల్లో ఉన్నా సరే.. రేషన్ పంపిణీ చేయండి
ABN , First Publish Date - 2022-07-13T16:21:18+05:30 IST
కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి, ముందుజాగ్రత్తగా చాలామంది శిబిరాలు, గంజికేంద్రాలు, బంధువుల ఇళ్లల్లోనూ
బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి, ముందుజాగ్రత్తగా చాలామంది శిబిరాలు, గంజికేంద్రాలు, బంధువుల ఇళ్లల్లోనూ తలదాచుకుంటున్నారని, వీరికి కూడా రేషన్ పంపిణీ చేయాలని సీఎం బొమ్మై సూచించారు. హారంగి రిజర్వాయర్ ప్రదేశంలో పూడికతీతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొడగు జిల్లాలోని నలుగురు తహసీల్దార్ల నిధుల్లో కోటి రూపాయల గ్రాంటు ఉందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసారి ఖరీఫ్ సీజన్లో పది రోజుల అవధిలోనే 114 శాతం వర్షం కురిసిందన్నారు. జిల్లాలో 15 ఇళ్లు పూర్తిగా ను, 63 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయన్నారు. కూలిన ఇళ్లకు రూ.5 లక్షలు, బాగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేల సాయం అందిస్తామని ప్రకటించిన సీఎం, తక్షణ సాయంగా రూ.50వేలు, సహాయసామగ్రిని అందచేస్తున్నామన్నారు.