విధుల్లో ఉంటూ కరోనాకు బలి
ABN , First Publish Date - 2021-05-17T05:01:59+05:30 IST
విశాఖ జిల్లాలో సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న క్లస్టర్ రీసోర్సు పర్సన్స్( సీఆర్పీలు) ఐదుగురు ఇప్పటి వరకు కరోనా బారినపడి చనిపోయారు.
విశాఖ జిల్లాలో ఐదుగురు సీఆర్పీలు ఇప్పటి వరకు మృతి
కంచరపాలెం, మే 16: విశాఖ జిల్లాలో సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న క్లస్టర్ రీసోర్సు పర్సన్స్( సీఆర్పీలు) ఐదుగురు ఇప్పటి వరకు కరోనా బారినపడి చనిపోయారు. మృతుల్లో నర్సీపట్నం, అనంతగిరి, పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో మిగిలిన సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
నర్శీపట్టణం,అనంతగిరి,పాడేరు,అరుకు,చింతపల్లి తదితర ప్రాంతాల వారున్నారు. ఉన్నత చదువు, క్షేత్రస్థాయిలో నిత్యం శ్రమిస్తున్న సీఆర్పీలకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇటువంటి సందర్భాల్లో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలీచాలని జీతంతో నెట్టుకు వస్తున్న సీఆర్పీలు చనిపోతే వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు.
దహన సంస్కారాలకు మాత్రం రూ.15 వేలు అందించి చేతులు దులుపుకొంటున్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి, పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడం తమ దురదృష్టమని సీఆర్పీలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య గుర్తించి కుటుంబాల్లో ఆందోళన తొలగించాలని, తమను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరుతున్నారు.