న్యాయ శాఖ మంత్రికి సీజేఐ కీలక ప్రతిపాదన

ABN , First Publish Date - 2021-10-23T23:12:20+05:30 IST

నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు

న్యాయ శాఖ మంత్రికి సీజేఐ కీలక ప్రతిపాదన

ఔరంగాబాద్ : నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను రానున్న పార్లమెంటు సమావేశాల్లో చేపట్టాలని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరానని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ శనివారం చెప్పారు. బోంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం అనెక్స్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడారు. 


నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు పంపించానని సీజేఐ తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిని చేపట్టేవిధంగా వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఏ సమాజానికైనా కోర్టులు చాలా అవసరమని చెప్పారు. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకమే ప్రజాస్వామ్యానికి అత్యంత గొప్ప బలమని చెప్పారు. న్యాయం పొందేందుకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుకు కోర్టులు భరోసా ఇస్తాయని తెలిపారు. కోర్టులకు మెరుగైన జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలనే ఆలోచన ఎప్పుడూ వెనుకబడి ఉంటోందన్నారు. దీనికి కారణం భారత దేశంలోని కోర్టులు శిథిలావస్థలోని నిర్మాణాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయనే ఆలోచనా ధోరణి అని చెప్పారు. శిథిలావస్థలోని నిర్మాణాల నుంచి న్యాయ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. 


సీజేఐ జస్టిస్ రమణ సెప్టెంబరులో కూడా నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అవసరాన్ని నొక్కి వక్కాణించారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేక సంక్లిష్ట సవాళ్ళను ఎదుర్కొంటోందన్నారు. మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పదవుల ఖాళీలు వంటివన్నీ న్యాయ వ్యవస్థను వేధిస్తున్నాయన్నారు. 


Updated Date - 2021-10-23T23:12:20+05:30 IST