జుడీషియల్‌ రికార్డుల్లో ఉన్నదే సీజే అడిగారు

ABN , First Publish Date - 2021-03-04T07:12:08+05:30 IST

బాధిత అమ్మాయిని పెళ్లాడతావా.. అని రేపిస్టును అడగడంపై సర్వత్రా విమర్శలు రేగడంతో వాటిపై సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. జుడీషియల్‌ రికార్డుల్లో ఉన్న విషయాన్నే జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించిందని కోర్టు అధికారి

జుడీషియల్‌ రికార్డుల్లో ఉన్నదే సీజే అడిగారు

బెంచ్‌పై విమర్శలు అన్యాయం: సుప్రీం


న్యూఢిల్లీ, మార్చి 3: బాధిత అమ్మాయిని పెళ్లాడతావా.. అని రేపిస్టును అడగడంపై సర్వత్రా విమర్శలు రేగడంతో వాటిపై సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. జుడీషియల్‌ రికార్డుల్లో ఉన్న విషయాన్నే జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించిందని కోర్టు అధికారి ఒకరు చెప్పారు. ‘ బాధితురాలు, రేపిస్టు సమీప బంధువులు  రేప్‌ తరువాత బాధితురాలు, తన తల్లితో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అదే సమయానికి అక్కడికి రేపిస్టు తల్లి వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవద్దని వేడుకుంది. బాధితురాలి వయసు 16ఏళ్లనీ, ఆమెకు 18 సంవత్సరాలు రాగానే తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననీ, తప్పకుండా కోడలిగా చేసుకుంటానని ఆమె హామీ ఇచ్చింది. ఆ విషయాన్ని ఓ స్టాంప్‌ పేపర్‌ మీద రాసిచ్చింది కూడా! తీరా 18 ఏళ్లొచ్చాక ఆమె తన హామీపై వెనక్కి తగ్గింది. పెళ్లీ లేదు, గిళ్లీ లేదని చెప్పేసింది. దాంతో బాధితురాలు రేప్‌ జరిగిందంటూ ఫిర్యాదు చేసింది. ఈ విషయం కోర్టు రికార్డుల్లో, పోలీసుల రికార్డుల్లో ఉంది. ఈ విషయాన్నే జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. పెళ్లి హామీ ఏమైందని నిలదీసింది.. ఆ తరువాత పరస్పరం మరికొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. దీన్ని తెలుసుకోకుండా అనేకమంది కోర్టుపై విమర్శలు చేయడం అన్యాయం’’ అని ఆ అధికారి వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-03-04T07:12:08+05:30 IST