అలా వెళ్లి వచ్చే లోపు చోరీ
ABN , First Publish Date - 2020-11-24T05:40:11+05:30 IST
సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో పట్టపగలు చోరీ జరిగింది.
రూ.6 లక్షల ఆభరణాలు అపహరణ
సూర్యాపేట క్రైం, నవంబరు 23: సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో పట్టపగలు చోరీ జరిగింది. కిరాణ దుకాణం వద్దకు సరుకులకు వెళ్లి అరగంటలో వచ్చే లోగా దొంగలు ఇంట్లోని ఆభరణాలను దొంగిలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నడిగూడెం జూనియర్ కళాశాలలో జూనియర్ రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న జక్కల వెంకటేశ్వర్లు సూర్యాపేటలోని విద్యానగర్లో అద్దెకు నివాసముంటున్నాడు. పనినిమిత్తం కుమారుడితో కలిసి స్వగ్రామమైన నార్కట్పల్లికి వెళ్లాడు. పని ఉండటంతో అక్కడే ఉండిపోయాడు. వెంకటేశ్వర్లు భార్య యాదమ్మ సరుకుల కోసం సోమవారం కిరాణ షాపు కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు రూ.6 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు అపహరించారు. కిరాణ సరుకులు తీసుకుని అరగంటలో ఇంటికి వచ్చే సరికి ఇంటి ముందు, వెనక తలుపుల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ఆంజనేయులు తెలిపారు.