తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన చిన్నారులు.. తాగునీటికోసం బావి దగ్గరికి వెళ్లి..
ABN , First Publish Date - 2020-08-10T13:16:30+05:30 IST
ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన..
విజయపురిసౌత్(గుంటూరు): ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన ఆదివారం మాచర్ల మండలం చింతలతండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ గేమ్యానాయక్, లక్ష్మానాయక్ అన్నాదమ్ముళ్లు. గేమ్యానాయక్ కుమార్తె కల్యాణి(15) ఈ ఏడాది చిలకలూరిపేటలో పదో తరగతి పూర్తి చేసింది. లక్ష్మానాయక్ కుమారుడు మధు (8) గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు.
భోజన సమయంలో మంచినీటి కోసం సమీపంలోని పొలంలో ఉన్న బావి దగ్గరకు వెళ్లారు. నీళ్లు పట్టుకుంటుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లేసరికి విగత జీవులుగా కనిపించారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చిన్నారుల మృతితో చింతల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.