బాలల రక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2022-08-19T05:07:40+05:30 IST
బాలల రక్షణ అందరి బాధ్యతని, వారి హక్కుల సాధన కోసం స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి పనిచేయాలని బాలల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గురుగుబెల్లి నరసింహమూర్తి పిలుపునిచ్చారు.
హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి
అరసవల్లి ఆగస్టు 18: బాలల రక్షణ అందరి బాధ్యతని, వారి హక్కుల సాధన కోసం స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి పనిచేయాలని బాలల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గురుగుబెల్లి నరసింహమూర్తి పిలుపునిచ్చారు. అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో గురువారం నిర్వహించిన బాలల హక్కుల వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల సమస్యలపై అవగాహన కలిగి, వాటి పరిష్కారం కోసం అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. జువైనల్ జస్టిస్ చట్టం- 2015 ప్రకారం జిల్లాలో ఓపెన్ షెల్టర్ నిర్వహించాల్సి ఉందన్నారు. కుటుంబం నుంచి విడిపోయిన, పారిపోయిన బాలలను రక్షించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే వరకూ వారికి ఓపెన్ షెల్టర్ కల్పించాల్సి ఉందన్నారు. కానీ, జిల్లాలో అటువంటి వసతి లేకపోవడం దురదృష్టకరమ న్నారు. చైల్డ్కేర్ ఇనిస్టిట్యూట్లను రోజురోజుకీ నిర్వీర్యం చేస్తున్నారని, వాటిని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. పాఠశాలలో నెలవారీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో బాలల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి రౌతు జ్యోతికుమారి, పారా అండ్ సీజ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ ఎల్.సంపత్కుమారి, టీం మెంబర్ బి.సంతోష్ కుమార్, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి కేకే చైతన్య, అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ వార్డెన్ మూగి మహందాత, కె.సీతారత్నం, ఎన్.శ్యామల, పి.మోహిని, తదితరులు పాల్గొన్నారు.