నేడు ముఖ్యమంత్రి రాక
ABN , First Publish Date - 2022-08-16T06:10:45+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అచ్యుతాపురం మండలం ‘సెజ్’కి రానున్నారు.
అచ్యుతాపురం సెజ్లో టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న జగన్మోహన్రెడ్డి
మరో ఎనిమిది కంపెనీల నిర్మాణానికి భూమి పూజ
అనకాపల్లి/ అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అచ్యుతాపురం మండలం ‘సెజ్’కి రానున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 10.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో అచ్యుతాపురం సెజ్కు వెళతారు. ఇక్కడ యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెందిన మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆఫ్టీమస్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్, విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్, సైనాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్, స్టైరాక్స్ లైఫ్సెన్స్ ప్రైవేటు లిమిటెడ్, ఇషా రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి విశాఖవిమానాశ్రయానికి చేరుకుంటారు. 1.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహమైన ఎమ్మెల్యే కుమారుడు, కోడలిని ఆశీర్వదిస్తారు. 1.40 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి వెళతారు.
పారిశ్రామిక ప్రగతికి కృషి: మంత్రి అమర్
అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. సోమవారం యకహోమా ఏటీసీ టైర్స్ కంపెనీలో మీడియాతో మాట్లాడుతూ, తొలివిడత రూ.1400 కోట్లతో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని సీఎం జగన్ ప్రారంభిస్తారని, రెండో దశలో రూ.1000 కోట్లతో దీనిని విస్తరిస్తారని చెప్పారు. మరో రూ.1500 కోట్లతో ఏర్పాటు చేసే 8 కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ పరిశ్రమల ఏర్పాటైతే 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ గౌతమి శాలి, తదితరులు వున్నారు.