ఛిద్రమైన రోడ్లు
ABN , First Publish Date - 2020-12-06T05:07:13+05:30 IST
ఇటీవల ఎడతెరపి లేకుండా మూడురోజుల పాటు కురిసిన నివర్ వరదలకు కార్పొరేషన్ పరిధిలోని నగర శివారు కాలనీల రోడ్లు చిధ్రమయ్యాయి.
అవస్థలు పడుతున్న స్థానికులు
పట్టించుకోని అధికారులు
కడప(నాగరాజుపేట), డిసెంబరు 5: ఇటీవల ఎడతెరపి లేకుండా మూడురోజుల పాటు కురిసిన నివర్ వరదలకు కార్పొరేషన్ పరిధిలోని నగర శివారు కాలనీల రోడ్లు చిధ్రమయ్యాయి. కాలనీ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలైనా ఇప్పటికీ సిమెంటు రోడ్లకు నోచుకోకపోవడం దారుణం. తాత్కాలికంగా వేసిన మెటల్ రోడ్లు కంకర లేచి గుంతలమయమైంది. దీనికితోడు వచ్చిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిని రోడ్లన్నీ బురదమయమయ్యాయి.
నగర మూడవ డివిజన్ పరిధిలోని రాజంపేట జాతీయ రహదారి నుంచి దండోరా కాలనీ, అంబేడ్కర్ నగర్లకు వెళ్లే రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది. చీకటి పడితే రోడ్లలో వెళ్లాలంటే స్థానికులు భయపడుతున్నారు. గుంతలు, బురద, విషపురుగులతో మత్స్యకాలనీ, తిలక్నగర్, పోలీసు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా తిలక్నగర్, చలమారెడ్డిపల్లెకు వెళ్లే లింక్రోడ్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని బురదగుంతలు ఏర్పడ్డాయి. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది పాలకులు మారినా రోడ్ల పరిస్థితి మారలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సిమెంటు రోడ్లు ఏర్పాటు చేసి స్థానికుల కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.
రోడ్లు లేక ఇబ్బందిగా ఉంది
తమ కాలనీకి సరైన రోడ్లు లేక ఇబ్బందికరంగా ఉంది. తమ కాలనీ నుంచి నగరంలోకి వెళ్లాలంటే చాలా అవస్థలు పడుతున్నాము. ఎన్నో ఏళ్లుగా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఏర్పాటు చేయాలి.
- జళ్లగాండ్ల జ్యోతి, దండోరా కాలనీ
పాలకులు పట్టించుకోలేదు
కాలనీ ఏర్పాటై ఎన్నో ఏళ్లు అయింది. అప్పటి నుంచి ప్రభుత్వాలు, పాలకులు మారినప్పటికీ మా కాలనీ రోడ్ల పరిస్థితి మారలేదు. వర్షం వచ్చిందంటే నరకమే. ద్విచక్ర వాహనాలు, పాదచారులకు ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల పరిస్థితి మార్చాలి.
- కైపు సుబ్బమ్మ, అంబేడ్కర్ నగర్