సీఎం ఆదేశాలతో జరిమానా వాపస్
ABN , First Publish Date - 2021-05-17T15:24:58+05:30 IST
ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. తిరువళ్లూర్ జిల్లా సెవ్వాపేట సమీపం
చెన్నై/పెరంబూర్: ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. తిరువళ్లూర్ జిల్లా సెవ్వాపేట సమీపం సిరుకూడల్ గ్రామానికి చెందిన బాలచంద్రన్ (48). అతని తొమ్మిదేళ్ల కుమారుడికి బుద్ధిమాంధ్యం. కుమారుడికి మందులు కొను గోలు చేసేందుకు బాలచంద్రన్ శుక్రవారం తిరువళ్లూర్ వచ్చాడు. లాక్డౌన్ అమలులో ఉండడంతో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు బాల చంద్రన్ను ఆపి హెల్మెట్ లేదని రూ.500 జరిమానా విధించారు. ‘తన కుమారుడి మందుల కోసం రూ.1,000 మాత్రమే ఉందని’ బాలచంద్రన్ బతిమిలాడినా పోలీసులు వినిపించుకోక పోవడంతో జరిమానా చెల్లించి, మాత్రలు తీసుకోకుండా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని బాలచంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్లో పేరొన్నాడు. సీఎం ఆదేశాలతో సచివాలయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని విచారించారు. ఈ నేపథ్యంలో, శనివారం తిరువళ్లూర్ తాలూకా సీఐ రజనీకాంత్, బాలచంద్రన్ ఇంటికి వెళ్లి, జరిమానా కింద వసూలుచేసిన రూ.500 చెల్లించి క్షమాపణ కోరాడు.