చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టం ఉపసంహరిస్తాం : ఉత్తరాఖండ్ సీఎం

ABN , First Publish Date - 2021-11-30T19:29:38+05:30 IST

చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని

చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టం ఉపసంహరిస్తాం : ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్ : చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టాన్ని ఉపసంహరించాలని నిర్ణయించామని చెప్పారు. 


చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని 2019లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ దేవస్థానాల పూజారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి చట్టాన్ని తేవడం ఈ దేవస్థానాలపై తమకుగల సంప్రదాయ హక్కులను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేయాలని, బీజేపీ ఓటమికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని వీరంతా ఇటీవల నిర్ణయించారు. 


పూజారుల నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ, మనోహర్ కాంత్ ధ్యాని నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దేవస్థానం బోర్డు అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఈ కమిటీ తన నివేదికను ధామికి ఆదివారం సమర్పించింది. 


ముఖ్యమంత్రి ధామి మంగళవారం మాట్లాడుతూ, మనోహర్ కాంత్ ధ్యాని నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను తాము క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించాలని నిర్ణయించామని తెలిపారు. 


ఈ బోర్డు పరిధిలోకి కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి సహా 51 దేవాలయాలను తీసుకొచ్చారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ బోర్డు రద్దవుతుంది.


Updated Date - 2021-11-30T19:29:38+05:30 IST