Chanakya Niti: అనుబంధాలు దూరమవడానికి ఈ 3 విషయాలే కారణం!
ABN , First Publish Date - 2022-08-10T12:41:13+05:30 IST
సంబంధాలే మనిషికి బలం. మంచి, చెడు సమయాల్లో...
సంబంధాలే మనిషికి బలం. మంచి, చెడు సమయాల్లో ఈ సంబంధాలే కాపాడుతాయి. మనిషి కష్ట సమయాల్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండలేడు. అటువంటి పరిస్థితిలో, బంధువుల సహకారం ఎంతో అవసరం. అయితే మనుషుల మధ్య అనుబంధాలు దూరమవడానికి గల మూడు కారణాలను ఆచార్య చాణక్య వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్వం
మనుషుల మధ్య సంబంధాలు సున్నితమైన తీగలాంటివని, కలతలు ఏర్పడితే ఆ తీగ తెగిపోతుందని చాణక్యుడు చెప్పాడు. అవమానానికి వైద్యం లేదు. మనుషుల మధ్య సంబంధంలో గర్వం, అహంకారానికి చోటు ఉండకూడదు. ఇద్దరు మనుషుల మధ్య వైరం ఏర్పడినప్పుడు సాధారణ విషయాలకు కూడా అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. అందుకే మనిషి సమాజంలో గర్వంతో మెలగకూడదని చాణక్య తెలిపారు.
మొండితనం
మొండితనం వల్ల ఎదుటివారితో సంబంధాలు చెడిపోతాయి. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనసును బ్యాలెన్స్ చేసుకోలేని వ్యక్తి మొండితనాన్ని ఆశ్రయిస్తాడు. పట్టుదల, మొండితనం అనేవి సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో మనిషి ఇతరులకు హాని చేస్తాడు. ఎదుటి వ్యక్తిలోని మొండి స్వభావాన్ని ఎవరూ సహించరు.
అదుపులో లేని నోరు
అదుపులో లేని నోరు అనేక అనర్థాలకు కారణమవుతుంది. ఇటువంటి అలవాటు కలిగిన వ్యక్తి ఇతరులతో సత్సంబంధాలను నిలబెట్టుకోలేడు. పైగా ఇలాంటివారు చిన్నా, పెద్ద అనే విచక్షణను కోల్పోతారు. మొండిగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటివారికి సమాజంలో గౌరవం దక్కదని ఆచార్య చాణక్య తెలిపారు.