మల్లంపల్లిలో చాళుక్యులనాటి ఆలయాలు

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలోని పొలాల మధ్య గుంపుగా పెరిగిన చెట్ల మధ్యన రెండు ఆలయాలు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ బుధవారం గుర్తించారు.

మల్లంపల్లిలో చాళుక్యులనాటి ఆలయాలు
చాళుక్యుల నాటి ఆలయం, రాష్ట్రకూట శైలి మహిషాసుర మర్ధిని, గర్భగుడి లో ఉన్న అధిష్ఠాన పీఠం

 గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు

అక్కన్నపేట, డిసెంబరు 1: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలోని పొలాల మధ్య గుంపుగా పెరిగిన చెట్ల మధ్యన రెండు ఆలయాలు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆలయాల చరిత్ర గురించి వివరించారు. ఇందులో మొదటి ఆలయం చాళుక్యుల శైలి నిర్మాణాన్ని పోలి ఉన్నదని పేర్కొన్నారు. దేవాలయ అంతరాళం ద్వార శాఖకు ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు ఉన్నారని తెలిపారు. పైన ప్రస్తరం, గర్భగుడి ద్వార శాఖలకు ఇరువైపులా కలశాలు చెక్కి ఉన్నాయని వివరించారు. గర్భగుడిలో రెండు చతురస్రాకారాపు తొలులున్న దేవతా అధిష్టాన పీఠం ఉందని, ఇది భామాసమేత వేణుగోపాలస్వామి అధిష్ఠాన పీఠమై ఉంటుందని చెప్పారు. గర్భగుడికి ఎదురుగా రంగమండపం ఉందని తెలిపారు. పక్కనే ఉన్న మరో శిథిలాలయం ఉందని, దీనిని పన్నెండు చేతుల మైసమ్మగుడిగా స్థానికులు పిలుస్తున్నారని చెప్పారు. ఆలయ గర్భగుడి శిథిలమై ఉన్నదని, దేవాలయ మండప స్తంభాలు ఎర్లీ చాళుక్య శైలిలో ఉన్నాయని వివరించారు.కొన్ని స్తంభాలు పడిపోయి ఉన్నాయని, అక్కడే గోడకు ఆనించి పెట్టిన విగ్రహం రాష్ట్రకూట శైలి అష్ఠభుజ మహిషాసురమర్ధిని అమ్మవారిదని పేర్కొన్నారు. బహుశా ఈ అమ్మవారినే మైసమ్మగా పిలుస్తున్నారేమోనని వివరించారు. 

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST