గొలుసు తెంపిన గొరవయ్యలు
ABN , First Publish Date - 2021-10-19T05:41:30+05:30 IST
దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన కమనీయంగా సాగింది.
- శివనామ స్మరణతో మార్మోగిన దేవరగట్టు
హొళగుంద/ ఆలూరు రూరల్, అక్టోబరు 18: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన కమనీయంగా సాగింది. అనంతరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో సింహాసన కట్ట వద్ద మాళమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గొరవయ్యల నృత్య డమరుక నడుమ గొలుసు తెంపే కార్యక్రమం మొదలైంది. బల్లూరుకు చెందిన గొరవయ్య గాదిలింగస్వామి ఇనుప గొలుసును మూడో ప్రయత్నంలో తెంపారు. గొరవయ్యల డమరుకనాదం, శివనామ స్మరణతో దేవరగట్టు మారుమోగింది. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం దేవదాసీల క్రీడలు సాగాయి. బన్ని ఉత్సవాలలో చివరి ఘట్టమైన వసంతోత్సవంలో భక్తులపై గొరవయ్యలు రంగులను చల్లారు. గూళ్యంకు చెందిన వీరశైవులు దేవరగట్టులో అన్నదానం చేపట్టారు. 19న మంగళవారం ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ పూజారులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఎస్ఐలు విజయ్కుమార్, రామాంజులు బందోబస్తు ఏర్పాటు చేశారు.