‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ రంగు’
ABN , First Publish Date - 2020-11-28T06:33:53+05:30 IST
కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమవేనని రాష్ట్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కోన సత్యనారాయణ ఆరోపించారు.
మండపేట, నవంబరు 27: కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమవేనని రాష్ట్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కోన సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. జగనన్న తోడు పేరిట రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు అందిస్తున్న రూ.10వేలుకు సంబంధించి ప్రధానమంత్రి స్ట్రీట్వెండర్ ఆత్మనిర్బర్ నిధి పథకాన్ని కేంద్రం ఈఏడాది జూన్1న ప్రారంభించినట్టు కోన చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి నేరుగా వీధి వ్యాపారులకు రుణం ఇచ్చిన ఘనత కేంద్రానిదైతే.. అదేదో రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా ‘జగనన్న తోడు’ అని పేరు పెట్టుకోవడం సరికాదన్నారు. కనీసం ప్రధానమంత్రి పేరుకాని, కేంద్ర ప్రభుత్వం గురించి కాని ప్రస్తావించకపోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు.