15వ తేదీ నుంచే రైళ్లు.. ఇందులో అసలు నిజమెంతో తేల్చేసిన కేంద్రం..
ABN , First Publish Date - 2020-04-10T20:44:00+05:30 IST
దేశ వ్యాప్తంగా రద్దయిన పలు రైళ్ల రాకపోకలను తిరిగి ఏప్రిల్ 15 నుంచి కొనసాగిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ రైల్వే శాఖ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. రైళ్ల రాకపోకల
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రద్దయిన పలు రైళ్ల రాకపోకలను తిరిగి ఏప్రిల్ 15 నుంచి కొనసాగిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ రైల్వే శాఖ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. మీడియాలో ప్రసారమవుతున్న తప్పుడు వార్తలను కొట్టిపారేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని జాతీయ రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, అలా చేయడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకున్న తదుపరి రైల్వే శాఖ ప్రజలకు తెలియజేస్తుందని అన్నారు.
కాగా ఈ నెల 15న లాక్డౌన్ ముగుస్తుండడంతో రైల్వేశాఖ ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కొన్నివార్తలు వస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత ప్రజలు రైలు ప్రయాణం చేయాలంటే కొన్ని నిబంధనలు తప్పక పాటించాలని ఆ వార్తల సందేశం. ప్రయాణ సమయానికి 4 గంటల ముందే స్టేషన్కు వెళ్లి అక్కడ థర్మల్ స్క్రీనింగ్ చేయించుకున్నాకే ప్రయాణించాల్సి ఉంటుందని ఆ వార్తల్లో ఉంది. కొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసులకే కేంద్రం అనుమతిస్తున్నట్లు కూడా అందులో ఉంది. స్లీపర్ క్లాస్(నాన్ ఏసీ) కోచ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, నాన్స్టాప్ పద్ధతిలో (ఒకటి లేదా రెండు స్టేషన్ల మాత్రమే హాల్ట్) బయలుదేరే స్టేషన్ నుంచి గమ్యానికి చేరే స్టేషన్ వరకు నడుపుతారని సమాచారం. ఇప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,771కి చేరింది. అందులో 228 మంది వైరస్ బారినపడి మరణించారు.