ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
ABN , First Publish Date - 2022-08-06T05:38:49+05:30 IST
ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు
మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన
మెదక్ అర్బన్, ఆగస్టు5: ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ, పెట్రో, డీజిల్, గ్యాస్, అగ్నిపథ్ తదితర కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడారు. ఎనిమిదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ధరలు ఇష్టారాజ్యంగా పెంచిందన్నారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు కేంద్ర, రాష్ట్ర పాలనతో ఆకాశన్నంటి పేదల నడ్డి విరుస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరు తోడు దొంగల్లా దేశాన్ని, రాష్ర్టాన్ని దోచుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నీటి మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. నిరసనలో జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు అవారి శేఖర్, యాదగిరి, సీనియర్ నాయకులు సుప్రబాత్రావు, రాంచందర్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు మార్గం నాగరాజు, నర్సింహులు, శ్రీకాంత్రెడ్డి, మండల అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.