బీజేపీతో పొత్తు కుదిరింది : కెప్టెన్ అమరీందర్ సింగ్

ABN , First Publish Date - 2021-12-17T23:32:12+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని

బీజేపీతో పొత్తు కుదిరింది : కెప్టెన్ అమరీందర్ సింగ్

న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. రానున్న శాసన సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జి గజేంద్ర సింగ్ షెఖావత్, కెప్టెన్ సింగ్ ధ్రువీకరించారు. సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్, గజేంద్ర సింగ్ షెఖావత్ శుక్రవారం సమావేశమయ్యారు. రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించారు. అమరీందర్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, తాను షెఖావత్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యానని తెలిపారు. 2022లో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం తాము బీజేపీతో సీట్ల సర్దుబాటు కోసం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని తెలిపారు. గెలుపే ప్రధాన లక్ష్యంగా ఈ పంపకాలు ఉంటాయన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని 101 శాతం నమ్మకం ఉందన్నారు. 


Updated Date - 2021-12-17T23:32:12+05:30 IST