కాల్వలకు సెలవులు
ABN , First Publish Date - 2021-04-17T05:26:41+05:30 IST
పశ్చిమ డెల్టాకు ఆదివారం సాయంత్రం నుంచి నీటి విడుదల నిలుపుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఈడీ ఎం.దక్షిణామూర్తి తెలిపారు.
రేపటి నుంచి నీటి విడుదల నిలుపుదల
నిడదవోలు, ఏప్రిల్ 16: పశ్చిమ డెల్టాకు ఆదివారం సాయంత్రం నుంచి నీటి విడుదల నిలుపుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఈడీ ఎం.దక్షిణామూర్తి తెలిపారు. తిరిగి జూన్ మొదటి వారంలో పశ్చిమ డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది వేసవిలో కాలువలకు నీటి విడుదల నిలిపి వేసిన అనంతరం ఆధునికీకరణ పనులు జరిగేవి. ఈ ఏడాది జలవనరుల శాఖ రూ.120 కోట్ల పనులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చింది. అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది ఆధునికీకరణ పనులు జరిగే అవకాశం లేదు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లాలో చెరువులు నింపుకోవడం పూర్తయిందని దక్షిణామూర్తి తెలిపారు.
వేసవిలో నిర్వహణ, మరమ్మతు పనులు మాత్రమే..
పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రధాన కాలువల్లో కాలువలకు నీటి విడుదల నిలిపి వేసిన అనంతరం రూ.13 కోట్ల నిర్వహణ, మరమ్మతు పనులకు జలవనరుల శాఖ టెండర్లను పిలిచింది. ఏలూరు, నర్సాపురం, అత్తిలి, ఉండి, జి అండ్ వి కాలువలకు సంబంధించి మరమ్మతులు నిర్వహణలో భాగంగా తూడు, మట్టి తొలగింపు, కాలు వగట్లను పటిష్టం చేయడం వంటి పనులకు మాత్రమే అనుమతులు లభించాయి. అది కూడా ఈ నెల 19 వరకు టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని, నెలాఖరు కు టెండర్లు తెరిచి అర్హత పొందిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం జరుగు తుందని నీటిపారుదల శాఖ కార్యాలయం తెలిపింది.