రైలు పట్టాలు దాటబోతుంటే ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-07-21T01:44:59+05:30 IST

ప్రమాదాలు చెప్పి రాకపోవచ్చు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండుప్రాణాలు గాలిలో..

రైలు పట్టాలు దాటబోతుంటే ఏమైందంటే...

చండీగఢ్: ప్రమాదాలు చెప్పి రాకపోవచ్చు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. హర్యానాలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న ఒక వ్యక్తిని డురంటో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అతను గాలిలోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్ వీర్‌సింగ్‌గా గుర్తించారు. అతను మహేంద్ర గఢ్ జిల్లా బావన గ్రామానికి చెందిన వ్యక్తిగా అధికారులు ధ్రువీకరించారు.


సోదరిని చూసేందుకని బయలుదేరి..

వీర్ సింగ్ తన సోదరి ఉంటున్న మజ్రా ఖుర్ద్ గ్రామం వెళ్తూ రైల్వే క్రాసింగ్ సమీపంలోని పట్టాలను దాటుతుండగా రేవారి నుంచి వస్తున్న రైలు ఢీకొంది. దీంతో ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రైల్వే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని మహేంద్రగఢ్ ఆసుపత్రికి తరలించారు. 2001లో బీఎస్ఎఫ్‌ ఫోర్స్‌లో చేరిన వీర్ సింగ్‌కు బికనీర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే అతను సెలవుపై ఇంటికి వచ్చారు. ఇంతలోనే వీర్ సింగ్ మృతి చెందడంతో అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వీర్ సింగ్ పనిచేస్తున్న బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు ఈ సమాచారం తెలియజేశారు.

Updated Date - 2022-07-21T01:44:59+05:30 IST