ప్రశాంతంగా అగ్రి ఎంసెట్
ABN , First Publish Date - 2020-09-29T06:24:49+05:30 IST
ఎంసెట్ 2020లో భాగమైన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
ఇరుజిల్లాల్లో 2024మంది హాజరు
ఖమ్మంఎడ్యుకేషన్ / పాల్వంచరూరల్, సెప్టెంబరు 28: ఎంసెట్ 2020లో భాగమైన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఇరుజిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 2024మంది పరీక్షకు హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని పరీక్ష కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం కలిపి మొత్తం 2119 మందికిగాను 1839 మంది హాజరుకాగా 270 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం నగరంలో ఉదయం ఐదు కేంద్రాల్లో 1,158 మందికి 1,012 మంది హాజరవగా, మధ్యాహ్నం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 961 మందికి 827మంది హాజరయ్యారు. అయితే కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్క్లు ధరించి, సెల్ఫ్ శానిటైజర్స్తో పరీక్షకు వచ్చారు.
సామాజిక దూరం పాటించారు. వారికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేశాకే అనుమతిచ్చారు. ఉమ్మడిఖమ్మం జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. పరీక్షలను ఎస్ఆర్అండ్మబీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్ కేఎస్ఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు మొత్తం 230మందికి గాను 185మంది హాజరయ్యారు.