ఎల్వోసీ వద్ద బంకర్లు!
ABN , First Publish Date - 2020-09-21T08:30:02+05:30 IST
కశ్మీర్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త దారులు కనిపెట్టారు. దట్టమైన తోటల్లో భూగర్భంలో బంకర్లు తవ్వి అందులో దాక్కుంటున్నారని కల్నల్ ఏకే సింగ్ తాజాగా వెల్లడించారు...
- కశ్మీర్లో ఉగ్రవాదుల కొత్త ప్రణాళికలు
- పీవీసీ పైపులతో డ్రగ్స్, డ్రోన్ల ద్వారా ఆయుధాలు
న్యూఢిల్లీ/షోపియన్, సెప్టెంబరు 20: కశ్మీర్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త దారులు కనిపెట్టారు. దట్టమైన తోటల్లో భూగర్భంలో బంకర్లు తవ్వి అందులో దాక్కుంటున్నారని కల్నల్ ఏకే సింగ్ తాజాగా వెల్లడించారు. మరోవైపు.. సరిహద్దుల వద్ద పాక్ నుంచి భారత్లోకి డ్రగ్స్ను, ఆయుధాలను కొత్త దారుల్ని ఉగ్రవాదులు కనిపెడుతున్నారు.
పీవీసీ పైపుల ద్వారా మాదకద్రవ్యాలను, డ్రోన్ల ద్వారా ఆయుధాలను దేశంలోకి పంపేందుకు యత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో దేశంలోకి తరలించబోయిన 62కిలోల హెరాయిన్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బీఎ్సఎఫ్ ఆదివారం ఉదయం కశ్మీర్లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద స్వాధీనపరచుకుంది. ఈ మేరకు బీఎ్సఎఫ్ ఐటీ ఎన్ఎ్స జామ్వాల్ మీడియాకు తెలిపారు. ‘‘శనివారం అర్థరాత్రి సమయంలో సరిహద్దు వద్ద బీఎ్సఎ్ఫకు, పాక్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. చొరబాటుదారులు తిరిగి పాకిస్థాన్లోకి పారిపోయారు. ఉదయం మేము చేపట్టిన తనిఖీలో 62 ప్యాకెట్ల హెరాయిన్తో పాటు పలు ఆయుధాలు, మందుగుడు సామగ్రి లభ్యమయ్యాయి. కంచెకు అటువైపు నుంచి ఇటువైపునకు పీవీసీ పైపులను పెట్టి, ఆయుధాలను, డ్రగ్స్ను దుండగులు భారత్లోకి తరలిస్తున్నారు’’ అని జామ్వాల్ స్పష్టం చేశారు. డ్రోన్లను ఉపయోగించి జమ్మూ కశ్మీర్లోకి పాకిస్థాన్ ఆయుధాలను తరలిస్తోందని ఆయన వెల్లడించారు. కాగా.. భారత్లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు భారీగా ఉన్నారంటూ ఐక్యరాజ్యసమితి(యూఎన్) విడుదల చేసిన నివేదికను కేంద్రం తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి లోక్సభలో స్పష్టం చేశారు. ‘‘యూఎన్ విడుదల చేసిన నివేదిక గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ.. కర్ణాటక, కేరళలో ఐఎస్ ఉగ్రవాదులు భారీగా ఉన్నారన్నది మాత్రం అవాస్తవం’’ అని కిషన్ రెడ్డి లోక్సభలో తెలిపారు. కాగా.. తమ దేశంలో భారత రాయబారి జయంత్ ఖోబ్రగడేకు నియామకాన్ని పాకిస్థాన్ అడ్డుకుంది. పాక్లో భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను గత ఏడాది బహిష్కరించిన పాక్, తాజాగా జయంత్కు వీసాను నిరాకరించింది.