ఇళ్ల స్థలాల కోలం పంటకాల్వ పూడ్చేశారు!

ABN , First Publish Date - 2020-07-13T11:18:08+05:30 IST

ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ నాయకులు సాగించిన దందాతో సామాన్య రైతులు విలవిల్లాడిపోతున్నారు.

ఇళ్ల స్థలాల కోలం పంటకాల్వ పూడ్చేశారు!

విజయవాడ, ఆంధ్రజ్యోతి/ఉంగుటూరు : ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ నాయకులు సాగించిన దందాతో సామాన్య రైతులు విలవిల్లాడిపోతున్నారు. నిలువెత్తు నీరు నిలిచే భూములు.. పచ్చని పైరు పండే భూముల మధ్య ఉన్న పొలాలను కమీషన్‌ కోసం కక్కుర్తిపడి అడ్డగోలు ధరలకు కొనేసి జేబులు నింపుకొన్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది. అధికారుల కమీషన్‌ కోసం సుమారు 150 ఎకరాల రైతులకు సాగునీరు పారే మార్గమే లేకుండాపోయింది. దీంతో పచ్చని పైరు ఎండిపోతోందంటూ రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం ఆత్కూరులో పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు 27 ఎకరాలు కొన్నారు. ఇక్కడ ఎకరం రూ.35 లక్షలకు మించి పలకదు. అలాంటి చోట రూ.75 లక్షలు పెట్టి కొన్నారు.


అది కూడా పచ్చని పొలాల మధ్య. ఏలూరు కాల్వకు ఆనుకుని ఉన్న పొలాలను లే అవుట్లుగా మార్చి, ప్లాట్లుగా విడగొట్టి రోడ్లు వేసే క్రమంలో పంటకాల్వను అధికారులు పూడ్చివేశారు. దీంతో దిగువన ఉన్న సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందే మార్గం లేకుండాపోయింది. నారమళ్లు నీరందక ఎండిపోతున్నాయి. దీంతో కడుపుమండిన రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. పొలాల మధ్యన కాకుండా వేరేచోట స్థలం సేకరించాల్సిందని, అలాకాకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కమీషన్ల కోసం పొలాన్ని ఇళ్ల స్థలాలకు సేకరించారని ఆరోపించారు. పంటకాల్వను పూడ్చివేస్తే తమకు సాగునీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మద్దతు పలికారు. దీనిపై తహసీల్దార్‌ దుర్గారావు మాట్లాడుతూ పంటకాల్వను పూడ్చివేసిన విషయమై ఇరిగేషన్‌ డీఈకి లేఖ రాశామని, రెండు, మూడు రోజుల్లో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2020-07-13T11:18:08+05:30 IST