ఎల్జీ ప్రసంగంతో ప్రారంభం కానున్న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ABN , First Publish Date - 2021-03-07T23:48:47+05:30 IST
జాతీయ గీతాలాపనతో సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
న్యూఢిల్లీ: జాతీయ గీతాలాపనతో సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరంభం కానున్నాయి. అనంతరం 11.02 గంటలకు అసెంబ్లీని ఉద్దేశించి లెఫ్టినెట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రసంగిస్తారు. ఈనెల 16వ తేదీ వరకూ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి సి.వేలుమురగన్ తెలిపారు. 10.45 గంటల కల్లా సభ్యులంతా తమకు కేటాయించిన సీట్ల వద్దకు చేరుకోవాలని ఆయన కోరారు. తొలి రోజు సమావేశాల్లో భాగంగా ఇటీవల కాలంలో దివంగతులైన సభ్యులకు సంతాపం తెలపడం, గవర్నర్ ప్రసంగ పాఠాన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లో సభ ముందుంచడం వంటివి ఉంటాయి. 2021-22 సంవత్సరాని ఆర్థిక సర్వేను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సభలో ప్రవేశపెడతారు. 2020-21 ఔట్కమ్ బడ్జెట్ స్థాయీ నివేదికను కూడా సభకు సమర్పిస్తారు. కోవిడ్ నిబంధనావళిని బడ్జెట్ సమావేశాల్లో యథాప్రకారం అమలు చేయనున్నారు.