బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో కరోనా..!
ABN , First Publish Date - 2020-04-01T16:19:21+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బీటెక్ విద్యార్థిని దాసరి స్రవంతి (20) మంగళవారం ఒంటిపై...
కరోనా లక్షణాలు ఉన్నాయని సూసైడ్ నోట్
కారణమది కాదంటున్న తల్లి
ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు
తంగళ్లపల్లి(రాజన్న సిరిసిల్ల జిల్లా): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బీటెక్ విద్యార్థిని దాసరి స్రవంతి (20) మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి బాలయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె స్రవంతి. సిద్దిపేట జిల్లా ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఉపాధి కోసం తండ్రి బాలయ్య గల్ఫ్ వెళ్లాడు. సోదరుడు వంశీ హైదరబాద్లో క్యాబ్ నడిపిస్తున్నాడు. తల్లి లక్ష్మి, కూతురు స్రవంతి జిల్లెల్ల క్రాసింగ్లో ఉంటున్నారు.రోజూలాగే తల్లి పొలం పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్రవంతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి స్రవంతి పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సరికే మంటలు ఆరిపోయాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సర్వర్, ఎస్సై అభిలాష్ తెలిపారు.
కరోనా లక్షణాలు ఉన్నాయని సూసైడ్ నోట్
కరోనా లక్షణాలు ఉన్నాయని, తన కుటుంబ సభ్యులకు కరోనా వ్యాధి రాకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్రవంతి సూసైడ్ నోట్లో పేర్కొంది. కళాశాలకు వెళ్తున్న క్రమంలో బస్సులో సీట్లో తన పక్కన కూర్చున్న వారి నుంచి కరోనా వైరస్ సోకి ఉంటుందని, తనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిందని పేర్కొంది. తల్లిని బాగా చూసుకోవాలని సోదరుడికి విజ్ఞప్తి చేస్తూ సూసైడ్ నోట్ రాసింది. తన కూతురుకి కరోనా లక్షణాలు లేవని, ఆత్మహత్యకు కరోనా కారణం కాదని మృతురాలి తల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా విచారణ చేపట్టాలని కోరింది.