ఆంగ్లేయ మాజీ కలెక్టర్ సమాధి కోసం అన్వేషణ
ABN , First Publish Date - 2021-07-22T13:38:22+05:30 IST
మద్రాసు ప్రెసిడెన్సీకి 200 యేళ్ళకు ముందు కలెక్టర్గా పనిచేసిన ఆంగ్లేయ అధికారి సమాధి కోసం దిండుగల్ అంతటా అధికారులు తీవ్రంగా వెదుకుతున్నారు. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఆదేశాల
చెన్నై: మద్రాసు ప్రెసిడెన్సీకి 200 యేళ్ళకు ముందు కలెక్టర్గా పనిచేసిన ఆంగ్లేయ అధికారి సమాధి కోసం దిండుగల్ అంతటా అధికారులు తీవ్రంగా వెదుకుతున్నారు. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు ఈ అన్వేషణ కొనసాగుతోంది. 1810లో మద్రాసు ప్రెసిడెన్సీ కలెక్టర్గా ఆంగ్లేయ అధికారి వైట్ ఎన్నీస్ పనిచేశారు. ఆయన సమాధి దిండుగల్ నగరంలో వుండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఆంగ్లేయ మాజీ కలెక్టర్ వైట్ ఎన్సీస్ సమాధిని కనుగొనేందుకు చర్యలు చేపట్టమంటూ దిండుగల్ జిల్లా కలెక్టర్ విశాఖన్కు ఉత్తర్వు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ విశాఖన్, దిండుగల్ కార్పొరేషన్ కమిషనర్ శివసుబ్రమణ్యం పర్యవేక్షణలో ఆంగ్లేయ మాజీ కలెక్టర్ సమాధిని కనుగొనేందుకు కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. దిండుగల్ మలైకోట దిగువనున్న కామరాజ్నగర్ వద్ద ఓ క్రైస్తవుల సమా దుల ప్రాంతం ఉన్నట్టు కనుగొన్నారు. చిట్టడవిలా ఉన్న ఆ ప్రాంతాన్ని కార్మికులు శుభ్రం చేస్తున్నారు. రెండు రోజుల తర్వాత అక్కడ 20 మందికిపైగా ఆంగ్లేయ ప్రముఖులు, వారి కుటుంబీకుల సమాధులు, క్రైస్తవ మతపెద్దల సమాధులను చూసి అందరూ దిగ్ర్భాంతి చెందారు. ఇప్పటివరకూ అక్కడ ఆంగ్లేయుల సమాధులున్నట్టు ఎవరికీ తెలియదు. ఇక మద్రాసు ప్రెసిడెన్సీ కలెక్టర్ వైట్ ఎన్నీస్ సమాధి మాత్రం కనిపించకపోవడంతో అధికారులు నిరాశ చెందారు. దీంతో దిండుగల్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో వైట్ ఎన్సీస్ సమాధి కనుగొనేందుకు అధికారులు సిబ్బంది సిద్ధమవుతున్నారు.