కరోనా వ్యాక్సీన్‌పై మోదీకి వెరైటీగా థ్యాంక్స్ చెప్పిన బ్రెజిల్ అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2021-01-23T16:17:52+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు వీలుగా రెండు మిలియన్ల కొవిడ్-19 వ్యాక్సిన్లను బ్రెజిల్‌కు పంపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి...

కరోనా వ్యాక్సీన్‌పై మోదీకి వెరైటీగా థ్యాంక్స్ చెప్పిన బ్రెజిల్ అధ్యక్షుడు!

న్యూయార్క్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు వీలుగా రెండు మిలియన్ డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లను బ్రెజిల్‌కు పంపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటైన భారత్ శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సిన్ వాణిజ్య ఎగుమతులను ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్ నుంచి బ్రెజిల్‌కు రెండు మిలియన్ డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపించారు. కరోనా కారణంగా తీవ్ర దుష్ప్రవాన్ని ఎదుర్కొన్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు ట్విటర్లో స్పందిస్తూ ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారం. అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ గొప్ప భాగస్వామితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. భారత్ నుంచి బ్రెజిల్‌కు వ్యాక్సిన్ ఎగుమతి చేసి మాకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు..’’ అని పేర్కొన్నారు. ట్వీట్ చివర్లో ఆయన హిందీలో ‘‘ధన్యవాద్’’ అంటూ హిందీలో రాయడం గమనార్హం.


దీంతో పాటు స్వయంగా హనుమంతుడే భారత్ నుంచి బ్రెజిల్‌కు వ్యాక్సిన్ తీసుకొస్తున్నట్టు  ఓ చిత్రాన్ని కూడా బోల్సనారో షేర్ చేశారు. యుద్ధంలో గాయపడిన లక్ష్మణుడిని కాపాడేలా సంజీవని మూలిక కోసం హనుమంతుడు మొత్తం కొండను మోసుకొస్తున్నట్టుగా రామాయణంలో జరిగిన ఇతివృత్తాన్ని స్ఫూర్తిగా తీసుకుని బ్రెజిల్ తాజా చిత్రాన్ని రూపొందించడం విశేషం. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ... ‘‘మాకే గౌరవంగా భావిస్తున్నాం. కొవిడ్-19 సంక్షోభంపై చేస్తున్న సంయుక్త పోరాటంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు. ఆరోగ్య రంగంలో మా సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా కొనసాగుతాం..’’ అని పేర్కొన్నారు.





Updated Date - 2021-01-23T16:17:52+05:30 IST