తాతయ్య తెచ్చిన లిక్కర్...ఫ్రూట్‌జ్యూస్ అనుకుని తాగిన పసివాడు...ఇద్దరూ ఘోరంగా...

ABN , First Publish Date - 2021-10-05T17:25:06+05:30 IST

ఫ్రూట్ జ్యూస్ అనుకొని తాతయ్య తెచ్చిన మద్యాన్ని తాగిన నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటన...

తాతయ్య తెచ్చిన లిక్కర్...ఫ్రూట్‌జ్యూస్ అనుకుని తాగిన పసివాడు...ఇద్దరూ ఘోరంగా...

వెల్లూరు (తమిళనాడు): ఫ్రూట్ జ్యూస్ అనుకొని తాతయ్య తెచ్చిన మద్యాన్ని తాగిన నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు కట్పడి సమీపంలోని గ్రామంలో వెలుగుచూసింది. చిన్నారి మనవడు తాను తెచ్చిన మద్యం తాగాడని చూసిన తాతయ్య గుండెపోటుతో మరణించాడు. తిరుప్పకుట్టాయ్ గ్రామానికి చెందిన పి చిన్నస్వామి (62) రోజువారీ కార్మికుడు. చిన్నస్వామి బ్రాందీ ఫుల్ బాటిల్ తోపాటు స్నాక్స్ ఇంటికి తీసుకువచ్చి తాగుతున్నాడు. చిన్న స్వామి కొడుకు సెందూర్ పాండి, కోడలు విజయలు ఎన్నికల సభలో పాల్గొనేందుకు బయటకు వెళ్లారు. ఇంట్లో చిన్నస్వామితోపాటు అతని మనవడైన నాలుగేళ్ల రుత్రేష్ కూడా ఉన్నాడు.


 చిన్నస్వామి సగం బాటిల్ బ్రాందీ తాగి టీవీ చూసేందుకు పక్కగదిలోకి వెళ్లాడు. అంతలో బాటిల్ లో పండ్ల రసం ఉందనుకొని బాలుడు రుత్రేష్ మద్యం తాగాడు. పండ్లరసం అనుకొని మద్యం తాగిన రుత్రేష్ శ్వాస పీల్చడం కష్టంగా మారటంతో రోదించాడు. అంతలో చిన్న స్వామి మనవడిని చూసి భయపడి కోడలు విజయకు సమాచారం అందించాడు. తాత చిన్నస్వామి నిర్లక్ష్యం వల్లనే రుత్రేష్ ప్రమాదంలో పడ్డాడని విజయ మామను అరిచింది. అంతలో మద్యం తాగి ఉన్న చిన్నస్వామి గుండెపోటుతో కుప్పకూలి పోయి మరణించాడు. 


గ్రామస్థుల సహకారంతో ఇద్దరిని కాట్పడి లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చిన్నస్వామి మరణించాడని, బాలుడు రుత్రేష్ ను క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పంపించాలని రిఫర్ చేశారు. వైద్యచికిత్స పొందుతూ బాలుడు రుత్రేష్ కూడా మరణించాడు.మద్యం ఇద్దరి ప్రాణాలను బలిగొనడంతో విషాదం అలముకుంది. దీంతో బాలుడి మామయ్య శంకర్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగడం వల్ల ఇద్దరు మరణించిన ఘటనతో తమిళనాడు రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని రాజ్యసభసభ్యుడు అంబుమణి రామదాస్ సర్కారును కోరారు. 


Updated Date - 2021-10-05T17:25:06+05:30 IST