బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-02T06:26:57+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం గ్రామంలో వెలిసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి వందల సవంత్సరాల చరిత్ర ఉన్నది.

బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం

గుమ్మడిదల, ఏప్రిల్‌ 1: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం గ్రామంలో వెలిసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి వందల సవంత్సరాల చరిత్ర ఉన్నది. ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని కార్యనిర్వహణాధికారి శశిధర్‌ తెలిపారు. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహరాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలియజేశారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆలయానికి హైదరాబాద్‌ బాలానగర్‌ అమీర్‌పేట్‌ల నుంచి వచ్చే వారు మెదక్‌ బోదన్‌ బాస్నువాడ, జీడిమెట్ల డిపోలకు చెందిన బస్సులు వయా నర్సాపూర్‌ మీదుగా వచ్చే బస్సు, మెదక్‌ నర్సాపూర్‌ గజ్వేల్‌, ఎల్లారెడ్డి నుంచి వచ్చే బస్సులు బొంతపల్లి కమాన్‌ వద్ద నిలుపుతారు. అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి రావాల్సి ఉంటుంది. సంగారెడ్డి, పటాన్‌చెరువు నుంచి ఆలయానికి బస్సు సౌకర్యం కలదు. 

కార్యక్రమాల వివరాలు

బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా నేడు నందీశ్వర వాహనసేవ, 3న ఆశ్వవాహన సేవ, 4న హంసవాహనసేవ, 5న బృంగీశ్వర వాహన సేవ, 6న పొన్న వాహన సేవ, అగ్నిగుండాలు, 7న స్వామివారి ఎదుర్కొలు, కల్యాణం, గజవాహన సేవ, పల్లకీ సేవ నిర్వహిస్తారు. 8న స్వామివారి దివ్య రథోత్సవం, 9న నాకబలి ఉంటాయి. 10న ఏకాంత సేవ, డోలోత్సవం, పవళింపుతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

Updated Date - 2021-04-02T06:26:57+05:30 IST