BJP state president: ఒంటరిగానే డీఎంకేతో ఢీ
ABN , First Publish Date - 2022-08-12T12:38:52+05:30 IST
ఇతర పార్టీలతో పొత్తు లేకుండా డీఎంకే ఎన్నికల బరిలోకి దిగితే, తామూ ఒంటరిగా తమ సత్తా ఏంటో చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP
- లోక్సభ ఎన్నికల్లో 25 సీట్లు మావే
- బీజేపీ అధ్యక్షుడు అన్నామలై
చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీలతో పొత్తు లేకుండా డీఎంకే ఎన్నికల బరిలోకి దిగితే, తామూ ఒంటరిగా తమ సత్తా ఏంటో చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పేర్కొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 25 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరవైయేళ్లుగా ద్రావిడ పార్టీల పాలనలో సామాజిక న్యాయం, సమానత్వానికి తావులేకుండా పోయిందని, ప్రస్తుత పాలకులు పేరుకు మాత్రమే సామాజిక న్యాయం కల్పిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజలకు ఆ న్యాయం అందించలేదన్నదే వాస్తవమని ఆయన చెప్పారు. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డీఎంకే(DMK) అధికారంలోకి వచ్చిన యేడాదిలోపే ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని ప్రజలంతా తెలుసుకున్నారన్నారు. నగరపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి డీఎంకే, అన్నాడీఎంకే తర్వాతి స్థానాన్ని పొందగలిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి రోజురోజుకూ ప్రజా మద్దతు అధికమవుతోందన్నారు. అన్నాడీఎంకేలో చీలికల ప్రభావం బీజేపీపై పడదని, ఎన్డీయేలోనే ఆ పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రజలకు రక్షణ కవచంగా నిలిచేది బీజేపీ మాత్రమేనని, ఆ దిశగానే ప్రజా మద్దతును కూడగట్టుకుని లోక్సభ(Lok Sabha) ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీని మతతత్త్వపార్టీ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలను తమ నేతలు తిప్పిగొడుతున్నారన్నారు. పార్టీని అభివృద్ధిపరచటమే తన ప్రధాన కర్తవ్యమని అన్నామలై(Annamalai) స్పష్టం చేశారు.