గుండెపోటుతో కన్నుమూసిన పోలింగ్ ఏజెంట్

ABN , First Publish Date - 2020-10-28T15:56:04+05:30 IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సందర్భంగా బుధవారంనాడు విషాద ..

గుండెపోటుతో కన్నుమూసిన పోలింగ్ ఏజెంట్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సందర్భంగా బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణ కుమార్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258లో ఆయన ఏజెంట్‌గా ఉన్నారు. పోలింగ్ బూత్‌లో కూర్చోగానే అకస్మాత్ముగా ఛాతీలో నొప్పి వచ్చిందని, చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.


తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 2.14 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్జేడీ తరఫున 42 మంది అభ్యర్థులు, జేడీయూ 35, కాంగ్రెస్ 21, సీపీఐ ఎంఎల్ 8, హెచ్ఏఎం 6, వీఐపీ అభ్యర్థి ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు ఆర్‌ఎస్ఎల్‌పీ 43, ఎల్‌జేపీ 42, బీఎస్‌పీ 27 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఉదయం 9 గంటల ప్రాంతానికి 6.03 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

Updated Date - 2020-10-28T15:56:04+05:30 IST