రైతులకు మద్దతు ప్రకటించిన వరుణ్ గాంధీ
ABN , First Publish Date - 2021-09-05T22:18:31+05:30 IST
కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకంగా ఆందోళలను సాగిస్తున్న రైతులకు బీజేపీ..
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకంగా ఆందోళలను సాగిస్తున్న రైతులకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆదివారంనాడు మద్దతు ప్రకటించారు. రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని అన్నారు. కిసాన్ పంచాయత్లను ఆయన సమర్ధించారు. రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాలని సూచించారు. ఫిలిబిత్ నియోజకవర్గానికి వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
''లక్షలాది మంది రైతులు ముజఫర్నగర్లో నిరసనలకు ఇవాళ సమావేశమయ్యారు. రైతులు మన సొంత మనుషులు. గౌరవప్రదంగా వారితో తిరిగి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. వారి బాధను అర్ధం చేసుకోండి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారితో కలిసి ఒక పరిష్కారానికి కృషి చేయాలి'' అని వరుణ్ గాంధీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
మూడు సాగు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకురావాలని రైతు సంఘాలు తొమ్మిది నెలలుగా ఆందోళనలు సాగిస్తున్నాయి. చట్టాల రద్దు కుదరదని కేంద్రం చెబుతుండంతో రైతులతో పలు విడతలు సాగించిన చర్చలు విఫలమయ్యాయి. కాగా, తమ డిమాండ్లు ప్రభుత్వం పట్టించుకునేంత వరకూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ ముజఫర్నగర్లో ప్రకటించారు.