ఉప ఎన్నికల్లో బీజేపీకి రైతు ఉద్యమ సెగ!

ABN , First Publish Date - 2021-11-02T23:17:05+05:30 IST

ఏడాది కాలంగా మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు దేశ సరిహద్దులో ఆందోళన నిర్వహస్తున్నారు. అయితే రైతుల ఆందోళనను విరమింపజేయడంలో కేంద్రంలోకి మోదీ ప్రభుత్వం విఫలమైంది..

ఉప ఎన్నికల్లో బీజేపీకి రైతు ఉద్యమ సెగ!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి రైతు ఆందోళన సెగ తగిలిందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన సీట్లను చూస్తే ఈ ప్రశ్న రాకుండా ఉండదు. మొత్తం 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ 8 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం గెలుచుకోగా.. బీజేపీ కేవలం 7 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో గెలిచింది. అధికారంలో ఉన్న చోట కూడా బీజేపీ చతికిల పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేపోయింది.


ఏడాది కాలంగా మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు దేశ సరిహద్దులో ఆందోళన నిర్వహస్తున్నారు. అయితే రైతుల ఆందోళనను విరమింపజేయడంలో కేంద్రంలోకి మోదీ ప్రభుత్వం విఫలమైంది. కొంత కాలంగా ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడటమే మర్చిపోయింది. ఈ ఆందోళన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మాత్రమే తీవ్రంగా ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఆ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కమల నేతలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.


బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, మిజోరాం, హర్యానా రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటున్న బిహార్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయింది. వాస్తవానికి తాజా ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో ఉన్న రాష్ట్రాలే. అస్సాం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ కొంత మేరకు పరవాలేదు అనిపించినా మిగిలన రాష్ట్రాల్లో బాగా వెనకబడి పోయింది. చిత్రంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి దాటి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవడం విశేషం.


అస్సాంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటితో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని కమల పార్టీ గెలుచుకుంది. ఇక కర్ణాటకలో రెండిండిలో ఒక స్థానం, తెలంగాణలో ఒక స్థానంలో గెలుపుకు సమీపంలో బీజేపీ ఉంది. ఇక ఎన్డీయే అధికారంలో ఉన్న బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ ఒక స్థానాన్ని గెలుచుకుంది. మొత్తం 23 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ గెలిచింది కేవలం 7 స్థానాలే. ఒక మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఒక స్థానమే గెలిచింది.


హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇక హర్యానాలోని ఏకైక నియోజకవర్గంలో కూడా బీజేపీ చాలా వెనుకబడి పోయింది. బెంగాల్ బీజేపీ కనీసం ఖాతా తెరవలేదు. రైతుల ఆందోళన ప్రభావం ఈ ఎన్నికలపై పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైతు ఆందోలనలో కీలకంగా ఉన్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం ఉంటుందని, బీజేపీ చాలా వరకు నష్టపోతుందని అంటున్నారు.

Updated Date - 2021-11-02T23:17:05+05:30 IST