నాడు-నేడు పనులు పక్కాగా ఉంటేనే బిల్లులు

ABN , First Publish Date - 2021-03-04T07:04:19+05:30 IST

మన బడి నాడు-నేడు’ పనులు పక్కాగా వుంటేనే బిల్లులు చెల్లించాలని, ఏమాత్రం నాణ్యత లోపాలు వున్నా బిల్లులు చెల్లించవద్దని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుడిత రాజశేఖర్‌ అన్నారు.

నాడు-నేడు పనులు పక్కాగా ఉంటేనే బిల్లులు
భీంపోలు పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న ముఖ్యకార్యదర్శులు రాజశేఖర్‌, కాంతిలాల్‌ దండే, తదితరులు

రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశం

భీంపోలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల సందర్శన


అనంతగిరి, మార్చి 3: ‘మన బడి నాడు-నేడు’ పనులు పక్కాగా వుంటేనే బిల్లులు చెల్లించాలని,  ఏమాత్రం నాణ్యత లోపాలు వున్నా బిల్లులు చెల్లించవద్దని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుడిత రాజశేఖర్‌ అన్నారు. ఆయన బుధవారం సాయంత్రం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండేతో కలిసి భీంపోలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించారు. నాడు-నేడు పనులను పరిశీలించిన ఆయన స్నానపు గదుల్లో శుభ్రత లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బాలికలకు అనువుగా లేకుండా నిర్మాణాలను తొలగించి, మళ్లీ నిర్మించాలన్నారు. ప్రతి పనిని ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని, నిబంధనల మేరకు పనులు జరిగితేనే బిల్లు చెల్లించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి, సమాధానాలను రాబట్టారు. మెరుగైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. అక్కడి నుంచి బయలుదేరి శివలింగపురం చేరుకున్నారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత అనంతగిరి చేరుకుని రాత్రి బసచేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌, డీడీ విజయ్‌కుమార్‌, ఈఈ శ్రీనివాస్‌, ఎంఈఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T07:04:19+05:30 IST