బిల్కిస్ బానో కేసులో ముద్దాయిల విడుదల తగదు
ABN , First Publish Date - 2022-08-19T06:21:18+05:30 IST
సంచలనం కలిగించిన బిల్కిస్ బానో కేసులోని 11 మంది ముద్దాయిలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు
వారి శిక్ష తగ్గింపును రద్దు చేయండి
సుప్రీంకోర్టుకు 6,000 మంది లేఖ
న్యూఢిల్లీ, ఆగస్టు 18: సంచలనం కలిగించిన బిల్కిస్ బానో కేసులోని 11 మంది ముద్దాయిలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామాహిక అత్యాచారం జరిపి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇప్పటికే వారు 15 ఏళ్లపాటు శిక్ష అనుభవించినందున దానిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దాంతో ఈ నెల 15న వారు గోధ్రా సబ్ జైలు నుంచి విడులయ్యారు.
దీనిని తప్పుపడుతూ దాదాపు 6,000 మంది పౌరులు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో సామాన్య పౌరుల నుంచి మాన మ హక్కుల కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల హంతకులు, రేపిస్టుల్లో ధైర్యం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వారికిచ్చిన మినహాయింపులను రద్దు చేసి తిరిగి జైలుకు పంపించాలని కోరారు.